ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఆ పార్టీ నేతలు వరుస షాకులిస్తున్నారు. బాబుపై నమ్మకం లేకపోవడంతో ముఖ్యనేతలందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్లు, నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి బాజాపాలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీనుంచి వికెట్లు పడుతూనె ఉన్నాయి.
తాజాగా బాబుకు ముఖ్యనేత అయిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. పార్టీ మారిన రాజ్యసభ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే సతీష్ పార్టీ వీడినట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సతీష్ అత్యంత సన్నిహితుడు కూడా. పార్టీ అధిష్టానం బుజ్జగించినా ….తన రాజీనామా లేఖను ఇప్పటికే అధినేత చంద్రబాబుకు పంపించారు. సతీష్ బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు కూడా త్వరలోనే టీడీపీని వీడనున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలో సీనియర్ నేతగా పేరొందిన సతీష్.. పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాశంగా మారింది. 2014 ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీచేసిన సతీష్.. వైఎస్సార్సీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓడిపోయారు. పార్టీకి విధేయతగా ఉండటంతో ఎమ్మెల్సీ ఇచ్చారు చంద్రబాబు.
రాజీనామా చేస్తూ లోకేష్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లోకేష్ వల్లే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. లోకేష్ కారణంగానే పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణం మీద కానీ లోకేష్కు అవగాహన లేదు. కానీ పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ చంద్రబాబు చేతుల్లో లేదు’ అని అన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ లోకేష్ గ్రూపులను ప్రొత్సహిస్తున్నారన్న సతీష్.. లోకేష్ పెంచి పోషించిన గ్రూపుల వల్లే గత ఎన్నికల్లో ఓటమి చెందామన్నారు.