తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. తొమ్మిది నెలల ముందే కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారు. ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అసెంబ్లీ రద్దుకు తెలంగాణ మంత్రివర్గం ఏకగీవ్రంగా తీర్మానించింది.
అనంతరం ప్రత్యేక బస్సులో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులంతా రాజ్ భవన్కు బయలుదేరారు. గవర్నర్ నరసింహన్ ను కలసి అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా కోరతారు. అనంతరం గన్ పార్కుకు వెళ్లి, అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు.
అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లి, మధ్యాహ్నం 2.30 గంటలకు మీడియాతో కేసీఆర్ మాట్లాడతారు. విలేకరుల సమావేశంలో కేబినెట్ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా వెలువరించనున్నారు. అంతే కాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి గల కారణాలను మీడియాకు వివరిస్తారు.
సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ గజ్వేల్ కు బయల్దేరుతారు. రేపు కోనాయపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హుస్నాబాద్ సభకు హాజరవుతారు. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు.