తెలంగాణాలో మహాకూటమి దాదాపు ఖరారయినట్లే. అయితే ఇప్పుడు సీట్ల పంపకాల విషయం సందిగ్ధం నెలకొంది. ఇక టీడీపీలో మాత్రం సీట్ల హడావుడి మొగలయ్యింది. తెలంగాణా నేతలందరూ అమరావతికి క్యూకట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన సీట్లనే ఈ సారి కూడా టీడీపీకే దక్కడంతో నేతల్లో ఆశవహులు ఎక్కువయ్యారు.
గత ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగర్ వంటి స్థానాలను మంచి మెజార్టీతో గెలుచుకుంది. ఈ స్థానాల్లో మళ్లీ ఎక్కువశాతం టీడీపీకి వదిలేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించే నేతలు చంద్రబాబును కలిసేందుకు అమరావతి బాట పడుతున్నారు.
తెలంగాణలో పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక అంశంలో ఇక్కడి నేతల అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు గతంలో చెప్పారు. టికెట్లు ఖాయం అనుకున్న నేతలు అధినేతను కలసి విజ్ణప్తులు చేస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు చెప్పే అంశాలను ఓపిగ్గా వింటున్న చంద్రబాబు… త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని… పార్టీ గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని వారికి సూచిస్తున్నారు. మొత్తానికి తెలంగాణలో టీడీపీ టికెట్ కోసం అమరావతిలో లాబీయింగ్ చేసే వారి సంఖ్య భారీగానే ఉన్నట్టు కనిపిస్తోంది. అధినేత బాబు ఎవరిని కరునిస్తాడో చూడాలి.
