ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతోంది. చంద్రబాబు జోక్యం చేసకున్నా ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. నియోజక వర్గంలో పోటా-పోటీ సైకిల్ యాత్రలతో రాజకీయం మరింత వేడెక్కింది. పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై కొంతమంది రాళ్లదాడి చేయడం కలకలంరేపగా… దీని వెనుక మంత్రి అఖిలప్రియ ఉందని విమర్శలు మొదలయ్యాయి.
ఈ వివాదం కొనసాగుతుండగానే మంత్రి అఖిలప్రియ, సుబ్బారెడ్డిలు పోటా-పోటీగా సైకిల్ యాత్రలకు పిలుపు నివ్వడంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కోట కందుకూరులో ఏవీ…. రుద్రవరంలో అఖిల యాత్ర చేపట్టునున్నారు. ఈ రెండు వర్గాలు ఎదురుపడితే గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసుల్ని భారీగా మోహరించినట్లు తెలుస్తోంది.
మరోవైపు తనపై జరిగిన రాళ్ల దాడిని నిరసిస్తూ ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ బంద్కు పిలుపునిచ్చినట్లు సమాచారం. అయితే దీనికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అలాగే రాళ్ల దాడికి సంబంధించి 18మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. కాని అందులో మంత్రి పేరును తప్పించడంపై సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య వివాదం ఏస్థాయికి వెల్తుందోనని టీడీపీ నాయకులు ఆందోళనలో ఉన్నారు.