ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ పూర్తి మెజారిటీ అధికారంలోకి రావడంతో ఈనెల 30న ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ పై పొగడ్త వర్షం కురిపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎవరూ కూడా సాధించలేని ఘన విజాయన్ని అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సాధించారని కొనియాడారు.
ఎన్టీఆర్ ఘన విజయాన్ని సాధించిన వేళ కూడా ఆయన ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకు సాగారని, జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారని గుర్తు చేశారు.నిన్న ఢిల్లీలో ప్రధానితో చర్చించి వచ్చిన తరువాత జగన్, మీడియాతో మాట్లాడిన వేళ తాను చూశానని, తనకు జగన్ లో వైఎస్ స్పష్టంగా కనిపించారని అన్నారు.మనసులోని మాటను బయటకు చెప్పేసే వైఎస్ నైజమే జగన్ లో కనిపించిందని ఉండవల్లి తెలిపారు.
అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పడం, పారదర్శకతను పెంచుతానని అనడం, జగన్ లోని పట్టుదలకు సంకేతమని అభిప్రాయపడ్డారు. పోలవరం పనులపై జ్యుడిషీయల్ బాడీని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వైఎస్సార్ గతంలో ఎవరిని సంప్రదించారో వారితోనే సంప్రదించి, వారి సలహాలను స్వీకరించండని వైఎస్ జగన్కు సూచించారు.
విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రూ. 23వేలకోట్ల ఆస్తులు ఇప్పటి వరకు రాలేదని గుర్తుచేశారు. వాన్పీక్ వైఎస్సార్ డ్రీమ్ అని.. దాని వల్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాలో నిరుద్యోగం సమసిపోతుందని చెప్పారు. సిటీ ప్రాజెక్టును ప్రారంభించిన ఘనత వైఎస్సార్కే దక్కుతుందని పేర్కొన్నారు. కేరళలలో అవినీతికి జరకుండా అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను వైఎస్ జగన్ ఇక్కడ కూడా అమలుచేస్తే.. మరో 30 ఏళ్లు సీఎంగా ఆయనే కొనసాగుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వసలహాదారుగా అజయ్కల్లాం నియామకం హర్షనీయమని ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. చంద్రబాబుపై నెగిటివ్ ఓటుతో జగన్ అధికారంలోకి రాలేదన్నారు. ప్రజలకు ఏదో చేస్తాడన్న నమ్మకంతో జగన్కు ఓటేశారన్నారు. ఆ నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకుంటారి ఆశిస్తున్నానని తెలిపారు. ఈ నెల 30వ తేదీన ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి జగన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.