తెలంగాణాలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. రోజు కొక కొత్త పార్టీ లు పుట్టుకొస్తున్నాయి. తెలంగాణా జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ కొత్త పార్టీని పెట్టే యోచనలో ఉన్నారు. తాజాగా కాగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరుల హవానే వేరు. ఒకవైపు కీలకమైన నల్గొండ జిల్లా నుంచి ప్రాతినిథ్యం, మరోవైపు బలమైన రెడ్డి సామాజికవర్గం, దీనికి తోడు ఎంతైనా ఖర్చు చేయగలిగే ఆర్థిక స్థితి వీరిది. గత కొంత కాలంగా వీరు కాంగ్రెస్ హైకమాండ్ పై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిదే . తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొనగలిగే సామర్థ్యం ఉన్న తమను కాదని ఉత్తమ్ కుమార్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిని కట్టబెట్టారని వీరు ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కాగలిగిన స్థాయి ఉన్న తమను కాదని ఉత్తమ్ కు పట్టం కట్టడాన్ని వీరు జీర్ణించుకోలేక పోతున్నారు.
దానికి తోడు రేవంత్రెడ్డి కాంగ్రెస్ ఖండువా కప్పుకోవడంతో వారి అసంతృప్తి మరింత పెరిగింది. మరో వైపు పార్టీ కూడా రేవంత్ కు తగిన గుర్తింపును ఇవ్వాలనే యోచనలో ఉండటం కూడా వీరికి నచ్చలేదు. దీంతో తమ దారి తాము చూసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వీరి అడుగులు కొత్త పార్టీ ఏర్పాటు చేసే దిశగా పడుతున్నాయని చెబుతున్నారు. దీనిలో భాగంగానె కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రామోజీ గ్రూపు అధినేత రామోజీరావును కలిశారు. దాదాపు అరగంట సేపు ఆయనతో చర్చలు జరిపారు. తమకు మీ ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా రామోజీని కోమటిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది.
కొత్త పార్టీ ఏర్పాటు చేస్తె భవిష్యత్తు ఎలా ఉంటుందనే సలహాలను కూడా రామోజి నుంచి తీసుకున్నారంట. ఇదే ఇప్పుడు టీ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. కొత్త పార్టీ పెడితే వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తె తామే చక్రం తిప్పవచ్చనె ఆలోచనలో ఉన్నారంట. ఇది ఎంత వరకు నిజమనేది తేలాల్సి ఉంది.