కోమటిరెడ్డి బ్రదర్స్…తెలంగాణ రాజకీయాల్లో కాస్త అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున వీరికి అనుచరగణం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీరిని రాజకీయంగా పైకి తీసుకొచ్చారు. వెంకట్రెడ్డిని ఎమ్మెల్యే, మంత్రిగా చేసినా రాజగోపాల్ రెడ్డిని ఎంపీగా చేసినా అది వైఎస్ పుణ్యమే. అయితే కొద్దికాలంగా రాజకీయంగా వీరు అనుసరిస్తున్న వైఖరితో సొంత పార్టీ కార్యకర్తలే కాదు వీరి అనుచరగణం సైతం అసహ్యించుకునే పరిస్థితి ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఉప ఎన్నిక రాగా తమ్ముడికే ఓటేయాలంటూ ప్రచారం చేశారు వెంకట్ రెడ్డి. తర్వాత కాంగ్రెస్ ఇక గాడిన పడుతుంది అన్న ప్రతీసారి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ మళ్లీ వెనక్కిలాగుతారనే అపవాదు సైతం ఉంది. అందుకే గతమెంతో ఘనం అన్నట్లు…ఇప్పుడు వీరిని పట్టించుకోవడం మానేశారు.
అయితే తాజాగా ఎన్నడూలేని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రేమను ప్రదర్శించారు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. చంద్రబాబు వల్లే ఐటీ అభివృద్ధి చెందిందని…ఆయనకు మద్దతుగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం ఏంటని కొత్త పల్లవి అందుకున్నారు. ఇక కోమటిరెడ్డి వ్యాఖ్యలు టీకాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఫస్ట్ లిస్ట్ తర్వాత పార్టీలో చేరికలు పెరుగుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఏంటని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పక్క రాష్ట్రం రాజకీయాల గురించి మనకెందుకని మండిపడుతున్నారు. అసలు సడన్గా చంద్రబాబుపై కోమటిరెడ్డికి ఇంత ప్రేమ ఎందుకు కలిగిందో ఆయనకే తెలియాలని కొంతమంది చెబుతుండగా మరికొంతమంది మాత్రం కోమటిరెడ్డిని లైట్ తీసుకుంటున్నారు. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలుగుతున్నాయని ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందోనని నల్గొండ జిల్లా నేతలే చెబుతున్న పరిస్థితి ఉంది.