ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తన స్వార్థరాజకీయం కోసం అబద్దాలు ఆడటంతో బాబు పీహెచ్డీ చేశారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసమే ప్రజలపై ప్రేమను ఒలక బోస్తున్నారన్నారు. కడపలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ప్రస్తుతం టీడీపీతో పాటు యొల్లో మీడియాతో యుద్ధం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు దొంగ సర్వేలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యారని వాటిని పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు.
ఎన్నికల్లో గెలిచేందందుకు బాబు ఎంతటి నీచానికైనా ఒడిగడతారని వెల్లడించారు. డబ్బులసంచులతో ఊర్లో దిగుతారని..ఓటుకు రూ. 2 వేలు. రూ. 3 వేలు అంటూ మభ్యపెట్టడానికి సిద్ధమవుతారని దుయ్యబట్టారు. ‘ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ బాబులో ఆందోళన పెరుగుతోందన్నారు. ఇప్పటి వరకు59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని…దీనిపై సీఈసీకి కూడ ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ సానుభూతి పరుల ఓట్లనుకూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటి వరకు బాబు మూడు సినిమాలు ప్రజలకు చూపించారన్నారు. 2014 ఎన్నికల ముందు మొదటి సినిమా మొదలు పెట్టారన్నారు. సినిమాలో హామీల డైలాగ్లు కొట్టారన్నారు. వాటిలో ఒక్కటన్నా చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే రెండో సినిమా మొదలు పెట్టారన్నారు. అది రాష్ట్రాన్ని దోచుకోవడం అన్నారు. ఇప్పుడు ఎన్నిలకు సరిగ్గా ఆరు నెలల ముందు మూడు నెలల కోసం చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు.
భాజాపాతో నాలుగు సంవత్సరాలు కలసి ఉండి ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కి ఇప్పుడు ప్రత్యేకహోదాపై డ్రామాలు మొదలు పెట్టారన్నారు. హోదా కోసం ఉద్యమం చేస్తే అరెస్టులు చేయించిన బాబు…ఇప్పుడు నల్లచొక్కాలు వేసుకొని కేంద్రంపై పోరాటానికి బయల్దేరారన్నారు.