రేపటినుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్పీకర్ కోడెల శివప్రసాద్రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీకీ లేఖ రాశారు. లేఖపై స్పందించిన వైసీపీ ఫిరాయింపులపై వేటు వేస్తే సమావేశాలకు హాజరవుతామని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో వాటికి హాజరవుతారా లేదా అన్నది పక్కన పెడితే జగన్ మళ్లీ అదే తప్పు చేస్తున్నారన్న భావన ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.
గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి జగన్ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరో సారి వైకాపా అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం మంచిది కాదని అధికార పక్షంతోపాటు అనేకమంది విమర్శించారు.
కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే అనేక సార్లు జగన్ను విమర్శించారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు ప్రస్తావించడానికేనని, దాన్ని విస్మరించి గైర్హాజరు కావడం మంచిది కాదని అన్నారు. ఆయనతో పాటు సామాన్య జనం కూడా ఇలానే మాట్లాడారు.
అయినప్పటికీ జగన్ నిర్ణయంలో మార్పు వచ్చేలా కనిపించడంలేదు. మరి ప్రజలు వైకాపా నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియదు. దీన్ని వారు నైతిక కోణంలో చూస్తున్నారా, తప్పుడు నిర్ణయమని అనుకుంటున్నారా తెలియదు. ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన సమయం. దాని వల్లప్రజల్లో ఉన్న వ్యతిరేకత భావన తగ్గేది.
దేశంలో ఫిరాయింపులు మామూలే. ఫిరాయంపు నేతలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ స్పీకర్ కోడెల శివప్రసాద్రావుకు ఫిర్యాదు చేసినా అవన్నీ బుట్ట దాఖలయ్యాయి. పదవులకోసం ఆశపడి పార్టీ మారిన వారిపై వేటు వేయాలని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే సెలవిచ్చారు. అయినా కూడా స్పీకర్లో ఎటువంటి మార్పు ఉండదు.
వైకాపా ఎమ్మెల్యేల్లోనే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి వచ్చినవారు ఎమ్మెల్యేగిరికీ రాజీనామా చేయలేదు. వారు శాసనసభ్యులుగా అర్హులో, అనర్హులో తేలలేదు. కేవలం కండువాలు మార్చుకొని నకిలీ టీడీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. వీరిలో నలుగురు మంత్రులూ అయ్యారు. ఈ సినిమా అంతా రాజ్యాంగానికి విరుద్ధం అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కోర్టులుగాని, ఎన్నికల కమిషన్గాని, గవర్నర్గాని ఇప్పటివరకు పట్టించుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా ఒరిగేది ఏమి లేదు. దాని ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.