ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తయారు చేసే మహిళలు మంత్రి గంటా నివాసం ముందు ఆందోళన చేస్తున్న వారిపై దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. కడుపు కాలి తమ జీతాలు పెంచాలని దర్నా చేస్తున్న మహిళలపై పోలీసులతో ప్రభుత్వం కొట్టించడం దారునమన్నారు.
పదవుల కోసం పార్టీలు మారే, బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టే గంటా శ్రీనివాస్ లాంటి వాళ్లకు మాత్రం చంద్రబాబు సపోర్ట్ చేస్తారని విమర్శించారు. విశాఖలో ఎంతో విలువైన భూములను దోచుకున్న గంటాను కేబినెట్ నుంచి సస్పెండ్ చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎనభై ఐదు వేల మంది మహిళలు పదహారేళ్లుగా మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారని, వారికి ప్రతి నెలా వెయ్యి రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. ఆ వెయ్యి రూపాయలు కూడా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదని, అయినా, వెయ్యి రూపాయలతో ఏం వస్తుంది? అని ప్రశ్నించారు.
తమ జీతాలు పెంచమని కోరినందుకు ఏకంగా వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తప్పించేసిందని, మధ్యాహ్న భోజనం తయారు చేసే బాధ్యతను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం కరెక్టు కాదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ లు తమ కొచ్చే కమిషన్ల కోసం అన్నింటినీ ప్రైవేటీకరించుకుపోతున్నారని, వీళ్లు ఎంత దిగజారి పోయారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.