ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కాని ఇప్పటి వరకు ఆ దిశగా చిత్తశుద్ధితో ఒక్క ప్రయత్నం జరగడంలేదన్నది వాస్తవం. రాజధానికి శంకుస్థాపనల పేరుతో హడావుడి చేయడం తప్ప ఒరిగేదేమిలేదు. అంతర్జాతీయ సంస్థలు ఇస్తున్న రాజధాని డిజైన్లను బాబు అంగీకరించడంలేదు.
అసలు విషయానికి వస్తే రాజధాని నిర్మాణం కోసం 35 వేల ఎకరాల భూమిని రైతులనుంచి సేకరించారు. ఇప్పటికి దాని మీద వివాదాలు నడుస్తూనె ఉన్నాయి. ఇప్పటి వరకు తూతూ మంత్రంగా తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీని నిర్మించారు. గడచిన మూడేళ్ళలో చంద్రబాబు కిందా మీదా పడి నిర్మించిన నిర్మాణం ఇదొక్కటే.
ఇప్పటికె వివిధ సంస్థలకు అప్పనంగా భూ కేటాయింపులు చేస్తూ ఉన్నారు. భూములు తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాల్ని ఏడాది, ఏడాదిన్నర లోపే మొదలు పెట్టేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. 13కి పైగా అంతర్జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థలకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఓపక్క భూసమీకరణలో వివాదాలు…. మరో పక్క ప్రైవేటు సంస్థలకు విచ్చల విడిగా భూకేటాయింపులు. ఇక్కడే సామాన్యుడికి ఓ చిన్న అనుమానం వస్తోంది. అసలంటూ, అమరావతిలో రాజధాని నిర్మాణానికి భూమి అనేది వుంటుందా.? ఇలా ఉంటె సామాన్యుల పరిస్థితిఏంటి. మెజార్టీ భూమిని ప్రైవేటు సంస్థలకు అప్పగించేస్తే, అది ప్రైవేటు రాజధాని అవుతుందిగానీ, ప్రజా రాజధాని ఎలా అవుతుందనేది ప్రజలు ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారు. భూకేటాయింపులకు సంబంధించి పూర్తి అధికారం ప్రభుత్వాలకే వున్నా, ఆ ప్రభుత్వాలకి నైతిక బాధ్యత ఉండటంతోపాటు . ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలి.
2019 ఏప్రిల్ తర్వాత ఏ క్షణాన అయినా సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశాలు సుస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈలోగా వీలైనన్ని ఎక్కువ భూ కేటాయింపులు చేసేయాలన్న ఆలోచన తప్ప, మిగిలిన ఏడాదిన్నర కాలంలో ఎలా రాజధానికి సంబంధించి అత్యవసరమైన శాశ్వత నిర్మాణాలు పూర్తి చేస్తామన్న ఆలోచన ప్రభుత్వంలో కన్పించడంలేదు. అసలంటూ ఇప్పటిదాకా అధికారిక భవనాలకు శంకుస్థాపనే జరగని పరిస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, భూకేటాయింపుల తర్వాత ఆ భవనాలకైనా స్థలం దొరుకుతుందా. అది బాబుకే తెలియాలి.