అజింక రహానే సెలక్టర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెలక్టర్లు తనని ఓపెనర్గా మాత్రమే చూశారని.. అందుకే శ్రీలంకతో వన్డే సిరీస్లో అవకాశం దక్కలేదని అజింక్య రహానె అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల ఆ సిరీస్ మొత్తం రహానె రిజర్వ్ బెంచ్కే పరిమితమయిన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన టీ20 సిరీస్కి సెలక్టర్లు అతడ్ని ఎంపికే చేయలేదు.
అయితే సౌత్ ఆఫ్రికా టూర్కు మాత్రం అవకాశం కల్పించారు. జనవరి 5 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించే భారత్ జట్టులో రహానెకి చోటు కల్పించారు. అక్కడ సఫారీలతో భారత్ జట్టు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. వన్డే, టీ20 జట్టులో ఛాన్స్ కోసం పోటీపడుతున్న రహానె.. టెస్టు జట్టులో మాత్రం సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. విదేశీ గడ్డపై రహానెకి మంచి రికార్డు కూడా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటన సన్నద్ధతపై రహానె మీడియాతో మంగళవారం మాట్లాడాడు.
జట్టులోని అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకుంది. అయితే.. భారత సెలక్టర్లు నన్ను ఓపెనర్గా మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో శ్రీలంకతో వన్డే సిరీస్లో రెగ్యులర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఉండటంతో నాకు అవకాశం దక్కలేదని వెల్లడించారు.
బాధ్యతల గురించి మాట్లాడాలంటే నాకు చాలా ఇష్టం. బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా ఏదైనా మైదానంలో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తా. దక్షిణాఫ్రికా పర్యటనలో మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు శ్రమిస్తున్నాను. జట్టు వైస్ కెప్టెన్ బాధ్యత ఓ ఛాలెంజ్గా భావిస్తానని రహానే తెలిపారు.