మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెటర్ శ్రీశాంత్ బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని 7 సంవత్సరాలకు తగ్గిస్తూ బీసీసీఐ అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే 6 సంవత్సరాలుగా నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్, మరో సంవత్సరం మాత్రమే నిషేధం మిగిలి ఉంది. 2020 సెప్టెంబర్ నుంచి శ్రీశాంత్ మరోసారి మైదానంలో దిగే అవకాశం ఉంది. ఇదలా ఉంటె శ్రీశాంత్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
శనివారం తెల్లవారుజామున కొచ్చిలోని శ్రీశాంత్ నివాసంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. తొలుత గ్రౌండ్ ఫ్లోర్ వ్యాపించిన మంటలు.. బెడ్ రూమ్ వరకూ వ్యాపించాయి. ఈఘటనలో బెడ్ రూమ్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.శ్రీశాంత్ భార్యా పిల్లలు సురక్షితంగా బయటకు వచ్చారు. స్థానికుల సాయంతో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీనా అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.ఆ సమయంలో శ్రీశాంత్ ఇంట్లో లేడు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.
రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినందుకు శ్రీశాంత్తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్లపై బీసీసీఐ 2013లో జీవితకాల నిషేధం విధించింది.