హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడికి జాతీయ జట్టులోకి సెలక్ట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐపీఎల్లో సీఎస్కే తరుపును ఆడుతున్న రాయుడు పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు చూస్తుంటే మళ్లీ టీమిండియా తలుపు తట్టనున్నాడా?
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తిరుగులేని ఆటతీరుతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న రాయుడు ఇంగ్లాండ్, ఐర్లాండ్లతో జరగనున్న టీ20 సిరీస్లో ఆడే అవకాశం ఉందని సమాచారం. రాయుడి ఆటతీరును గమనిస్తున్నామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రాయుడికి పిలుపు అందడం ఖాయమే.
ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్లో పది ఇన్నింగ్స్ ఆడిన రాయుడు 42.3 సగటుతో 423 పరుగులు సాధించాడు. చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న రాయుడు 151.61 స్ట్రయిక్ రేట్తో పరుగులు రాబట్టడం విశేషం. రాయుడు చివరగా 2016లో జింబాబ్వే పర్యటనలో ధోనీ నాయకత్వంలో భారత్ తరఫున ఆడాడు.