నాగ్పూర్లో జరిగిన రెండో టెస్టులో భారత్ ముందు లంక తల వంచింది. భారత బౌలర్లు విజృంభించడంతో ఏమాత్రం ప్రతిఘటించకుండా చేతులెత్తేసింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్లో 166 పరుగుకులకే కుప్పకూల్చిన విరాట్ సేన ఇన్నింగ్స్ 239 పరుగుల తేడాతో భారీ ఘన విజయాన్ని అందుకుంది. ఏ దశలోనూ భారత్ బౌలింగ్ను ఎదుర్కోలేక పోయిన లంకేయలు నాల్గో రోజు లంచ్ ముగిసిన కాసేపటికే చాపచుట్టేసి ఘోర ఓటమి పాలయ్యారు.
21/1 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి మైదానంలో నిలవలేకపోయారు. సమరవిక్రమ, పెరీరా, హెరాత్, గ్యామెజ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరగగా, కరుణరత్నే 18, తిరిమన్నే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, షనక 17, లక్మల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చండిమల్ (61) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో మూడు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.
చాన్నాళ్ల తర్వాత అశ్విన్ తన మాయాజాలం ప్రదర్శించాడు. జట్టు స్కోరు 102 వద్ద శనక (17), 107 వద్ద దిల్రువాన్ పెరీరా (0), రంగనా హెరాత్ (0)ను బంతి తేడాతో బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో చివరి వరకు నాటౌట్గా నిలిచిన సురంగ లక్మల్ (31; 42 బంతుల్లో 2×4, 21×6)తో కలిసి చండిమాల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. దీంతో కాసేపు స్కోరుబోర్డు కదిలింది. లంచ్ తర్వాత కొద్దిసేపటికే దినేశ్ చండిమాల్ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ పంపాడు. అప్పుడు స్కోరు 165. మరో పరుగు తర్వాత తన 300వ వికెట్గా లాహరు గమగె(0)ను అశ్విన్ ఔట్ చేయడంతో 166 పరుగుల వద్ద శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
భారత బౌలర్లలో రవి చంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మ, జడేజా, ఉమేశ్ యాదవ్లు తలో రెండు వికెట్లు తీసి విజయానికి సహకరించారు. మూడో టెస్టు శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆరంభం కానుంది.
జట్టు స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 205/10 (79.1 ఓవర్లకు)
భారత్ తొలి ఇన్నింగ్స్ : 610/6 డిక్లేర్ (176.1 ఓవర్లకు)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ : 166/10 (49.3 ఓవర్లకు)