స్వదేశంలో మంచి ఫామ్ కనబరిచి భారీ అంచానాల మధ్య దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారతజట్టు కు మొదటి టెస్ట్లో చేదు అనుభవం ఎదురయ్యింది. గెలవాల్సిన మొదటి టెస్ట్ను భారత్ స్వయంకృతం ఫలితంగా చేజార్చుకుంది. పేస్ బౌలింగ్కు అనుకూలించే సఫారీ పిచ్ల మీద స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేశారు. పాండ్య ఒక్కడే తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులు చేసి పరువు నిలబెట్టాడు.
తొలి టెస్టులో పరాభవం ఎదురైన నేపథ్యంలో రెండో టెస్టులో బరిలో దిగే ముందు జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. సెంచూరియన్ పిచ్ ఎలా ఉంటుందో అనే విషయం బ్యాట్స్మెన్ను ఒకింత కలవరానికి గురి చేసింది. ధావన్, రోహిత్లను ఎంపిక చేయడంపై టీమిండియా మీద అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
సెంచూరియన్లో రెండు టెస్ట్కు సన్నద్ధం అవుతోన్న కోహ్లి సేనకు పిచ్ క్యురేటర్ గుడ్ న్యూస్ చెప్పాడు. రెండో టెస్టు కోసం సంప్రదాయ వికెట్ను రూపొందిస్తున్నట్లు బ్ర్యాన్ బ్లోయ్ తెలిపాడు. ఈ పిచ్ మీద పచ్చిక తక్కువగా ఉంటుందని.. ఫలితంగా ఎక్స్ట్రా పేస్, బౌన్స్ ఉండవని క్యురేటర్ బ్ర్యాన్ బ్లోయ్ చెప్పాడు.
ఈ పిచ్ మీద ఐదు రోజుల ఆట సాధ్యం అవుతుందని బ్లోయ్ తెలిపాడు. తొలి రోజు పిచ్ మందకొడిగా ఉంటుందని.. ఆట ఆరంభంలో సీమ్కు అనుకూలిస్తుందని చెప్పాడు. రెండు, మూడు రోజుల్లో పిచ్ వేగవంతం అవుతుందని చెప్పాడు. నాలుగు, ఐదు రోజుల్లో మందగిస్తుందని చెప్పాడు.
పిచ్ నుంచి స్పిన్నర్లకు కొద్దిపాటి సహకారం లభిస్తుందన్నాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే ఛాన్స్ లేదని తెలిపాడు. ఓవరాల్గా సెంచూరియన్ పిచ్ మీద బ్యాటింగ్ కెప్టౌన్ తరహాలో కష్టంగా ఉండదనే సంకేతాలను క్యురేటర్ పంపాడు. మరి టీమిండియా రెండో టెస్ట్లోనైనా పోటీ ఇస్తుందా లేకా మొదటి టెస్ట్లో మాదిరి చేతులెత్తేస్తుందో చూడాలి.