శ్రీలంకతో జరగుతున్న టీ20 సిరీస్ క్లీన్ స్విప్పై భారత్ గురిపెట్టింది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్ల్లో భాగంగా రెండిటిలో టీమిండియా విజయం సాధించి సిరీస్ను కైవసం చేసకుంది. ఇక మిగలింది ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ క్లీన్స్వీప్ చేస్తుంది. సిరీస్ను అజేయంగా ముగిసి 2017 సంవత్సరా నికి విజయవంతంగా వీడ్కోలు చెబుతుంది.
టీమిండియా టాప్ ఆర్డర్ అసాధారణ ఫామ్లో ఉన్న దృష్ట్యా క్లీన్స్విప్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. ఎటొచ్చి లంకమీదనే ఒత్తిడి ఉంటుంది. ఆఖరిమ్యాచ్లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని లంక పట్టుదలతో ఉంది.
సిరీస్ ఇండోర్లోనే చేతికొచ్చింది. బ్యాట్స్మెన్ పరుగుల హోరెత్తిస్తున్నారు. బౌలర్లు మంచి జోరుమీదున్నారు. దీంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ముంబైలోనూ గెలిస్తే 3–0తో పొట్టి ఫార్మాట్ సిరీస్నూ ముగించి శ్రీలంకను రిక్తహస్తాలతో ఇంటికి పంపొచ్చు.
తిసారా పెరీరా సేన మాత్రం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. టెస్టుల్లో పోరాడింది. వన్డేల్లో (తొలి మ్యాచ్) షాకిచ్చింది. కానీ మెరుపుల సిరీస్లో మాత్రం భారత్ ధాటికి నిలువలేకపోతోంది. రెండు టి20లతో పాటు సిరీస్ను కోల్పోయిన శ్రీలంక లక్ష్యం ఒక్కటే… పరువు నిలబెట్టుకోవడం. ఆదివారం జరిగే మ్యాచ్లో గెలిచి ఊరట విజయంతో స్వదేశానికి పయనం కావాలని గట్టిగా భావిస్తోంది
టెస్టు, వన్డే సిరీస్ల తొలి మ్యాచ్లో ప్రత్యర్థి పేస్కు విలవిల్లాడిన భారత బ్యాట్స్మెన్ టి20 సిరీస్లో మాత్రం చెలరేగి ఆడుతున్నారు. తొలి రెండు మ్యాచ్ల్ని ఏకపక్షంగా ముగించడంలో బ్యాటింగ్ దళమే ప్రధాన పాత్ర పోషించింది. కెప్టెన్ రోహిత్, శ్రేయస్ అయ్యర్, లోకేశ్ రాహుల్ ఎదురులేని ఫామ్లో ఉన్నారు. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ రాహుల్ అర్ధసెంచరీలతో కదంతొక్కాడు. సారథి రోహిత్ విశ్వరూపానికి ఇండోర్ వేదిక మొదటి సాక్షి అయ్యింది. వెటరన్ స్టార్ ధోని కూడా ఫామ్లో ఉన్నాడు.
ముఖ్యంగా ఇండోర్ మ్యాచ్లో పది పరుగుల రన్రేట్తో వెళుతున్న లంక బ్యాట్స్మెన్ను అనూహ్యంగా కట్టడి చేశారు. వాంఖడేలోనూ వీళ్లిద్దరు జోరు కొనసాగించాలనుకుంటున్నారు. పేసర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మ్యాచ్లో ఉనాద్కట్ స్థానంలో బాసిల్ థంపికి అవకాశం దక్కొచ్చు.
మరోవైపు పర్యాటక జట్టు శ్రీలంక పరిస్థితి మాత్రం దీనంగా ఉంది. టెస్టు సిరీస్ పోయింది. వన్డే సిరీస్ చేజారింది. టి20 సిరీస్ను కాస్త అడ్వాన్స్గా… చివరి మ్యాచ్కు ముందే ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఇక మిగిలింది పరువు. అందుకే ఆఖరి పోరులో ఎలాగైన నెగ్గి భారత్ చేతిలో వైట్వాష్ బారి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది.
లంక టీమ్లో డిక్వెలా, తరంగ, కుశాల్ పెరీరా రెండో మ్యాచ్లో బాగా ఆడారు. అయితే మిడిలార్డర్ బ్యాట్స్మెన్ మాత్రం మూకుమ్మడిగా చేతులెత్తేయడం టీమ్ మేనేజ్మెంట్ను ఆందోళన పరు స్తోంది. బౌలర్లు కూడా ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు ధారా ళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు బ్యాటింగ్కు అనుకూలమైన వాంఖడే పిచ్పై ఏ మేరకు రాణిస్తారో చూడాలి.
జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), లోకేశ్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, కుల్దీప్/వాషింగ్టన్ సుందర్, ఉనాద్కట్/థంపి, బుమ్రా, చహల్.
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), తరంగ, డిక్వెలా, కుశాల్ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక/విశ్వ ఫెర్నాండో, అకిల ధనంజయ, చతురంగ డిసిల్వా/సచిత్, చమీర, నువాన్ ప్రదీప్.