లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా… ఇది సినిమా డైలాగ్. లాస్ట్ షాట్ ధోనీదైతే ఆ కిక్ వేరప్పా… ఇది క్రికెట్లో డైలాగ్. క్రికెట్లో విన్నింగ్ షాట్ అంటేనే అభిమానులకు ప్రత్యేకం. ఇక ఆ షాట్ ధోనిదైతే ఇంక చెప్పాల్సిన పనిలేదు అభిమానులకు పండుగే. ఎక్కడైనా మ్యాచ్ చివరిలో ఉత్కంఠ కొనసాగుతుంది. విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
2011 ప్రపంచకప్ ఫైనల్ విన్నింగ్ షాట్ అయితే ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నిలిచిపోయింది. ఇప్పటికే ఎన్నో మ్యాచ్ల్లో విన్నింగ్ షాట్లతో భారత్ను గెలిపించిన ధోని తాజా భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో మరోసారి విన్నింగ్ షాట్తో మెరిసాడు. ఆన్సైడ్లో చూడచక్కని బౌండరీ కొట్టిన ధోనీ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే అది విన్నింగ్ షాట్ మాత్రమే ఈ ఏడాదికి భారత్ కొట్టిన ఆఖరి షాట్ కూడా. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేయగా తెగ వైరల్ అయింది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే 31 వేలకు పైగా వ్యూస్, ఏడువేల లైక్లు వచ్చాయి.
ఈ ఏడాది భారత్ ఆడిన ఆఖరి మ్యాచ్ ఇది. దీని తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్ వచ్చే ఏడాది మొదలవుతుంది. ఈ ఏడాది భారత్ క్రికెట్ హిట్ సినిమా రేంజ్లో సాగింది. కెప్టెన్ ఎవరూ అనే విషయంతో సంబంధం లేకుండా మ్యాచ్లు మీద మ్యాచ్లు గెలుస్తూ వచ్చింది. మొత్తంగా ఈ ఏడాది భారత్ అన్ని ఫార్మాట్లలో కలిపి 37 విజయాలు సాధించింది. ఓ ఏడాది అత్యధిక విజయాలు సాధించిన జట్లలో భారత్ది రెండో స్థానం.
మ్యాచ్ చివర్లో కొంత ఉత్కంఠ రేపినా ధోని,కార్తీక్లు భారత్ విజయాన్ని సులువు చేశారు. చివరి రెండు ఓవర్లో భారత్ విజయానికి 15 పరుగులు రావల్సి ఉండగా.. ఈ ఇద్దరు బాల్ టు బాల్ సింగిల్స్ తీశారు. కార్తీక్ సిక్స్ కొట్టడంతో చివరి ఓవర్లో 3 పరుగులు అవసరమయ్యాయి. స్ట్రైకింగ్లో ఉన్న ధోని తొలి బంతికి రెండు పరుగులు రాబట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించి విన్నింగ్ షాట్తో మ్యాచ్ను ముగించాడు.