ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 క్రికెట్ మ్యాచ్లో ఏకంగా 1,045 పరుగులు చేశాడు. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కోపార్ కహిరానె – నవీ ముంబై జట్ల మధ్య మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో తనిష్క్ గవాటే అనే యువ క్రికెటర్ తన అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు.
యశ్వంత్ రావ్ చవాన్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ తాజాగా 515 బంతుల్లో 149 ఫోర్లు, 67 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్లో తనిష్క్ అజేయంగా 316 పరుగులు చేయడం విశేషం. అతడి బ్యాటింగ్ శైలిని, ఎనర్జీని చూసిన క్రీడా పండితులు ఆశ్చర్యపోతున్నారు.
అయితే ఆఫ్సైడ్, లెగ్సైడ్ బౌండరీ దగ్గరగా ఉండటంతో ఇన్ని పరుగులొచ్చాయని కోచ్ మనీష్ తెలిపాడు. మరోవైపు ఈ టోర్నీకి ముంబై క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు లేదని అధికారులు స్పష్టం చేశారు.