వర్షాకాలం వచ్చిందంటే చాలు దేశంలో ఉరుములు, మెరుపులతో పిడుగులు పడతాయనే భయం చాలా మంది ప్రజల్లో ఉంది. దీనికి తోడు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల పడటం సాధారణంగా ఉంటుంది. వర్షకాలంతో సంబంధం లేకుండా కూడా ఇటీవల పలు చోట్ల పిగుడులు పడ్డ సంగతి తెలిసిందే. అయితే, ఇవి ఎలాంటి సమయంలో పడతాయో అనేది ఇప్పిటి సరైనా అంచనాలు అందించడంలో ముందస్తు హెచ్చరికలు చూసే వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో ప్రతియేటా వేల మంది మెరుపులు, ఉరుములు, పిడుగుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉరుములు, మెరుపులు, పిడుగులపై పరిశోధన చేయడానికి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నామని తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దీనిని సంబంధించిన వివరాలను భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈ పరిశోధన కేంద్రాన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ), ఐఎండీ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సహకారంతో ఒడిశాలోని బాలేశ్వర్లో ఏర్పాటు చేయనున్నారు.
ఈ కేంద్రంలో పూర్తి స్థాయి పరిశోధన నెట్వర్కులు, ఆటో స్టేషన్, రాడార్లు, మైక్రోవేవ్ రేడియో మీటర్ లతో పాటు మరిన్ని వ్యవస్థలు అందుబాటులో ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. ప్రతి ఏటా ఉరుములు పిడుగుల కారణంగా అపార నష్టం జరుగుతున్నదనీ, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కేంద్రం కోసం సమీప ప్రాంతాలలో కొన్ని అబ్జర్వేటరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్ భోపాల్ లో కూడా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.