దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్కు సుప్రీంకోర్టు రెండు స్పష్టమైన ప్రత్యామ్నాయాలను ఇచ్చింది. ఆమె స్వయంగా పోలీసులకు లొంగిపోవాలని, లేదంటే తామే ఆమె బెయిల్ను రద్దు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హనీమూన్ ట్రిప్లో ఉన్న సమయంలో తన భర్తను అత్యంత దారుణంగా హత్య చేయించిందనే తీవ్రమైన ఆరోపణలు సోనమ్పై ఉన్నాయి.
ఈ కేసులో షిల్లాంగ్ దిగువ న్యాయస్థానం సోనమ్కు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో భాగంగా కీలకమైన సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసేలోగా సోనమ్ లొంగిపోవాలని కోర్టు సూచించింది. ఆమె లొంగిపోయిన తర్వాతే కేసు మెరిట్స్ ఆధారంగా బెయిల్ దరఖాస్తును పునఃపరిశీలిస్తామని తేల్చిచెప్పింది. ఒకవేళ సోనమ్ లొంగిపోవడాన్ని ఎంచుకుంటే.. ట్రయల్ కోర్టు ద్వారా సాక్షుల విచారణను వేగవంతం చేయిస్తామని, ఆమె బెయిల్ పిటిషన్ను త్వరగా పరిశీలించాలని ఆదేశిస్తామని పేర్కొంది. ఈ నెల 23లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిందితురాలికి గడువు విధించింది. లేనిపక్షంలో, ఇరువర్గాల వాదనలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని కోర్టు తనదైన రీతిలో తగిన నిర్ణయం తీసుకుంటుందని హెచ్చరించింది.
కేసులో ఇప్పటివరకు ఏం జరిగిందంటే.. నవదంపతులుగా మేఘాలయకు హనీమూన్కు వెళ్లిన సోనమ్, ఆమె భర్త అక్కడ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో భర్తను పథకం ప్రకారమే కడతేర్చారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో సోనమ్తో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే కొద్ది రోజుల తర్వాత షిల్లాంగ్ న్యాయస్థానం సోనమ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిందితురాలికి ట్రయిల్ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని కోరింది. తాజాగా ఈ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు నిందితురాలికి లొంగిపోవాలని లేదా బెయిల్ రద్దును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అల్టిమేటం జారీ చేసింది.
