హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, విధి నిర్వహణకు వెళ్తున్న ఒక ఎయిర్పోర్టు ఉద్యోగినిని లక్ష్యంగా చేసుకుని క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యానికి యత్నించడం సంచలనం సృష్టించింది.
ఇండిగో ఎయిర్లైన్స్లో ఉద్యోగిగా పనిచేస్తున్న బాధితురాలు, రోజు మాదిరిగానే తన రాత్రి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి క్యాబ్లో బయలుదేరారు. అయితే విధి నిర్వహణ ప్రాంతానికి చేరాల్సిన ఆమెను, క్యాబ్ డ్రైవర్ కావాలనే మార్గమధ్యలో రూట్ మార్చాడు. శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి కారును మళ్లించి, ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఈ ఊహించని పరిణామానికి తీవ్ర భయపడిన ఆ ఉద్యోగిని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా డ్రైవర్ను అత్యంత సాహసంతో ప్రతిఘటించింది. ఆమె ప్రతిఘటనతో పాటు గట్టిగా కేకలు వేయడంతో కంగుతిన్న నిందితుడు, తన అఘాయిత్యం విఫలమవడంతో కారును అక్కడే వదిలి పరారయ్యాడు.
ఈ భయానక అనుభవం నుంచి తేరుకున్న బాధితురాలు, వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్టు ఔట్పోస్టు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, విమానాశ్రయ ఉద్యోగుల రవాణా, ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రతపై ఎయిర్పోర్టు అధికారులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, రవాణా భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.
