బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. భారతీయ సినీ పరిశ్రలో వివిధ భాషల్లో బిగ్ బాష్ షో ప్రసారం అవుతోంది. ఇక తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ 7వ సీజన్ నడుస్తోండగా కన్నడలోనూ త్వరలో ప్రారంభం కానుంది. కన్నడలో ఇది 10వ సీజన్. ఇక ఈ సీజన్లో పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే ఇంతవరకు బాగానే ఉన్న కర్ణాటక కాంగ్రెస్ ప్రదీప్ ఈశ్వర్ పాల్గొనడం చర్చనీయాశంగా మారింది. ప్రదీప్ ఈశ్వర్ హౌస్లోకి ప్రవేశించిన ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. దీంతో ఆయన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు మొదలయ్యాయి. ప్రదీప్ ఈశ్వర్పై చర్యలు తీసుకోవాలని వందేమాతరం సమాజ సేవా సంస్థ ప్రతినిధులు స్పీకర్కు లేఖ రాశారు. అలాగే బీజేపీ నేతలు సైతం ప్రదీప్ ఈశ్వర్పై విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో స్పందించారు ప్రదీప్.
బిగ్ బాస్లో కేవలం మూడు గంటల పాటు కనిపించమని తనని ఆహ్వానించారని చెప్పారు. ఈ షో ద్వారా కంటెస్టెంట్స్, యువతలో స్పూర్తి నింపేందుకు,తన జీవిత అనుభవాలు, కష్టాలను ఎలా అధిగమించాలో చెప్పేందుకే బిగ్ బాస్ ప్రతిపాదనకు ఒప్పుకున్నానని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వారికి అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది కానీ ఎపిసోడ్ ప్రసారం అయిన తర్వాత స్పందిస్తే బాగుండేది చురకలు అంటించారు.
ఇక బిగ్ బాస్ చరిత్రలో ఓ ఎమ్మెల్యే పాల్గొనడం ఇదే తొలిసారి. ఇక ప్రదీప్ ఈశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వినూత్నంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల వద్దకే వెళ్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండగా ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు ప్రదీప్ని టార్గెట్ చేస్తూ వినోద కార్యక్రమాల కంటే ప్రజా సేవకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎద్దేవా చేస్తున్నారు. ఏదిఏమైనా కన్నడనాట ఇప్పుడు ప్రదీప్ ఈశ్వర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
