విజయవాడ పార్లమెంట్…ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నియోజకవర్గం. ఎందుకంటే బెజవాడ పాలిటిక్స్లో అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని ఉత్కంఠతో చూస్తున్నారు.
టీడీపీ తరపున రెండుసార్లు విజయం సాధించారు కేశినేని నాని. గత ఎన్నికల్లో జగన్ సునామీలోనూ గెలుపొందారు నాని. కానీ ఈసారి వైసీపీ తరపున పోటీ చేస్తుండగా టీడీపీ నుండి నాని బ్రదర్ చిన్ని పోటీలో ఉన్నారు. నియోజకవర్గాల వారీగా బలాబలాలను పరిశీలిస్తే వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోందని అంతా భావిస్తున్నారు.
విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో దేవినేని అవినాష్ వైసీపీ నుండి పోటీ చేస్తుండగా టీడీపీ నుండి గద్దె రామ్మోహనరావు బరిలో ఉన్నారు. అయితే జనసేన సీటు ఆశీంచిన బత్తిన రాము వైసీపీలో చేరగా, యలమంచిలి రవి సైతం అవినాష్కు అండగా ఉండటంతో ఆ పార్టీదే గెలుపని భావిస్తున్నారు. అలాగూ విజయవాడ సెంట్రల్ నుండి వైసిపి అభ్యర్థిగా ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, సిపిఎం అభ్యర్థిగా సిహెచ్ బాబూరావు పోటీలో ఉన్నారు. ఈ ట్రయాంగిల్ పోరులో ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయోనని టెన్షన్ నెలకొంది.
విజయవాడ పశ్చిమ వైసిపి అభ్యర్థిగా షేక్ ఆసీఫ్, కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీలో ఉండగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. నందిగామ (ఎస్సి),జగ్గయ్యపేటలో సామాజిక సమీకరణాలే గెలుపు ఓటమలను నిర్దేశించనుండగా మైలవరంలో సామాన్యుడైన తిరుపతిరావుతో తలపడుతున్నారు వసంత కృష్ణప్రసాద్. ఇక్కడ వసంతకు దేవినేని వర్గం నుండి సహకారం అందడం లేదు. అలాగే తిరువూరు(ఎస్సీ)లోనూ వైసీపీనే గెలుస్తుందని టాక్ నడుస్తోంది. ఇక దీనికి తోడు నానికి ఉన్న క్లీన్ ఇమేజ్తో ఆయన హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంతా భావిస్తుండగా విజయవాడ ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో వేచిచూడాలి.