ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్యపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో క్యాబ్ డ్రైవర్లతో సమావేశమయ్యారు పవన్. ఏపీ క్యాబ్ డ్రైవర్లు రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలనడం సరికాదని అన్నారు. మ్మడి రాజధాని గడవుకాలం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ క్యాబ్ లు హైదరాబాద్ లో ఉండకూడదని అడ్డుకోవడం సబబు కాదని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలు రెండూ ఒక్కటేనన్న భావన అందరిలో ఉండాలని…ఇరు రాష్ట్రాల ప్రజల సఖ్యతే ప్రగతిలో ముందుకు నడిపిస్తుందని తెలిపారు. ఏపీలో అవకాశాలు మెరుగుపడితే ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగుతాయని చెప్పారు. ఫలితంగా తెలంగాణ ప్రజలకు వివిధ రకాల రంగాల్లో ఉపాధి మెరుగవుతుందని తెలిపారు.
ఏపీ క్యాబ్ డ్రైవర్లను అడ్డుకోవడం వల్ల 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనే సమస్య తన దృష్టికి వచ్చిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని పనులు త్వరలోనే మొదలవుతాయని.. మళ్లీ కార్యకలాపాలు మొదలు కానున్నాయని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సమస్యలు విన్నవించేందుకు ప్రజలు భారీ ఎత్తున ఫిర్యాదులతో వస్తున్నారన్నారు.
