తెలంగాణ రాజకీయాల్లో ఊహించిన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించేందుకు హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ జిష్ణు దేవ్వర్మకు (శివ్ప్రతాప్ శుక్లా) లేఖ పంపారు. ఆమెను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం కోరారు. స్వయంగా రాజీనామా చేసేందుకు సురేఖ ససేమిరా అనడంతో ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల పరకాలలో కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిని కించపరిచేలా ఆమె మాట్లాడారు. దీనిపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుమార్తె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, దానిని తాను ఖండించాల్సిన అవసరం లేదని సురేఖ బదులిచ్చారు. మరోవైపు వనపర్తి వ్యవహారంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి దారితీశాయి. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
చిన్నారెడ్డి స్థానంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని సీఎం నియమించారు. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్పర్సన్గా జి.సుధారాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తన బర్తరఫ్ నిర్ణయంపై కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. తనను తొలగించే ముందు వివరణ తీసుకోవాల్సిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తె వ్యాఖ్యలకు తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. తనపై కక్షపూరితంగానే ఈ చర్యలు తీసుకున్నారని భావిస్తున్నట్లు చెప్పారు. నేనేం తప్పు చేయలేదని, తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ ఆత్మపరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ తర్వాత రేవంత్నే ఎక్కువగా అభిమానించానని తెలిపిన ఆమె, భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
