కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్న వేళ ముస్లిం సంఘాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిల భారత ముస్లిం లాబోర్డు పిలుపు మేరకు ఎన్డీయే సర్కార్లో భాగమైన చంద్రబాబు సర్కార్ నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తున్నారు.
ఏలూరులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు హాజరుకాలేదు. జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ వైస్ చైర్మన్, టిడిపి నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డ్ లో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించరని అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి సెల్వికి తెలిపారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ ముస్లిం నేతలు కలెక్టర్ను కోరారు.
అలాగే విజయవాడ, ఏలూరు, గుంటూరు, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు.మసీదులకు నల్ల రిబ్బన్లు ధరించి హాజరై నిరసన తెలిపారు. ఈ పరిస్థితిని చంద్రబాబు సర్కార్ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.