హరారేలో జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ 219/5 భారీ స్కోరు సాధించి, అనంతరం 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడం ద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 200 ప్లస్ T20I స్కోర్లు నమోదు చేసిన తన సొంత ప్రపంచ రికార్డును సమం చేసింది. 2026లో భారత్కు ఇది తొమ్మిదోసారి 200 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు కాగా, 2024లో తను నెలకొల్పిన బెంచ్మార్క్ను ఇది సమం చేసింది. టీ20 చరిత్రలో మరే ఇతర పూర్తి స్థాయి ఐసిసి సభ్య దేశం కూడా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఇన్నిసార్లు 200+ స్కోర్లు సాధించకపోవడం భారత్ యొక్క నిలకడైన బ్యాటింగ్ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. 2023లో కూడా ఏడుసార్లు 200 ప్లస్ స్కోర్లను సాధించిన భారత్…2024లో జపాన్ మరియు 2025లో ఆస్ట్రియా సాధించిన ఏడుసార్ల రికార్డులతో పాటు ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు 200+ స్కోర్లు చేసిన ఐదు అగ్ర స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది.
ఈ రికార్డు ఇన్నింగ్స్ ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ జట్టు అద్భుతంగా కోలుకున్న తీరును చాటిచెప్పింది. పవర్ప్లేలోనే అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ వికెట్లను జింబాబ్వే పడగొట్టడంతో భారత్ కొంత ఒత్తిడికి లోనైంది, అయితే సూర్యవంశీ తొమ్మిది బంతుల్లోనే 20 పరుగులు చేసి వేగవంతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 66 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను చక్కదిద్దగా అనంతరం కిషన్, తిలక్ వర్మా కలసి సాధించిన 94 పరుగుల నిర్ణయాత్మక భాగస్వామ్యం మ్యాచ్పై భారత్కు పూర్తి ఆధిపత్యాన్ని తెచ్చిపెట్టింది. కిషన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఆఖరి ఓవర్లలో విరుచుకుపడుతూ అత్యధికంగా 81 పరుగులు చేశాడు. మరోవైపు తిలక్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ శతకాన్ని చేరుకుని, 29 బంతుల్లో 60 పరుగులతో నాటౌట్గా నిలవడంతో ఆఖరి ఐదు ఓవర్లలో భారత్ 61 పరుగులు రాబట్టగలిగింది.
లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు సైతం నిలకడైన ప్రదర్శనతో జింబాబ్వేను ఆలౌట్ చేసి 90 పరుగుల భారీ విజయాన్ని ఖాయం చేశారు. ప్రిన్స్ యాదవ్, అరంగేట్ర బౌలర్ యష్ ఠాకూర్ పవర్ప్లేలోనే మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వేను కోలుకోలేని దెబ్బతీశారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా వికెట్లు పడుతూనే వచ్చాయి. ఈ సమయంలో ప్రిన్స్ తొడ కండరాల గాయం (హ్యామ్స్ట్రింగ్) కారణంగా మైదానాన్ని వీడాల్సి రావడంతో కెప్టెన్ శ్రేయస్ పార్ట్-టైమ్ స్పిన్ ఆప్షన్లయిన తిలక్ వర్మ, అభిషేక్ శర్మలకు బంతిని అందించగా వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. తిలక్ కీలకమైన ర్యాన్ బర్ల్ వికెట్ను పడగొట్టగా అభిషేక్ ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి విజయాన్ని సులభతరం చేశాడు. ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్లతో వరుస ఓటముల తర్వాత భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం కాగా, నమ్మకమైన నాయకుడిగా ఎదిగేందుకు ఇది ఆయనకు ఎంతో సహాయపడుతుంది.
