భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్లేయర్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదనల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఏ+ గ్రేడ్ను పూర్తిగా రద్దు చేసి కేవలం ఏ, బీ, సీ అనే మూడు గ్రేడ్లకే పరిమితం చేయాలని భావిస్తోంది. ఈ మార్పులు అమల్లోకి వస్తే, టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు బీ గ్రేడ్కు మారే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఏ+ గ్రేడ్కు రూ.7 కోట్లు, ఏ గ్రేడ్కు రూ.5 కోట్లు, బీ గ్రేడ్కు రూ.3 కోట్లు, సీ గ్రేడ్కు రూ.1 కోటి వార్షిక రిటైనర్గా అందుతోంది. అయితే కొత్త విధానంలో జీతాల నిర్మాణం మారుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ విషయంపై రాబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇక మహిళా క్రికెట్కు సంబంధించి బీసీసీఐ శుభవార్త తెలిపింది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను రెట్టింపుకు పైగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సీనియర్ మహిళల దేశవాళీ వన్డే, బహుళ రోజుల టోర్నీల్లో తుది జట్టులో ఉన్న ఆటగాళ్లకు రోజుకు రూ.50 వేలు చెల్లించనున్నారు. దీంతో మహిళా క్రికెటర్ల ఆదాయం గణనీయంగా పెరగనుంది.
