పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చల్లా నాగరాజు ఇటీవల వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
2024 అక్టోబర్లో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను నాగరాజు వైయస్ జగన్కు వివరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్గా పనిచేశాననే కారణంతో టీడీపీకి చెందిన గూండాలు తనపై రాడ్లతో దాడి చేశారని తెలిపారు. ఆ దాడిలో తన రెండు కాళ్లు పూర్తిగా విరిగిపోయి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను వీల్చెయిర్కే పరిమితమై ఉన్నానని, దీనివల్ల కుటుంబ పోషణ తీవ్రంగా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, దాడి తర్వాత కూడా తన కుటుంబాన్ని వివిధ రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు.
నాగరాజు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న వైయస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. నాగరాజు కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆదుకుంటుందని, పార్టీ ఆయనకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా వైయస్ జగన్ను కలిసిన వారిలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్థానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు పాల్గొన్నారు.
