త్వరలో మళ్లీ జనం మధ్యలోకి వస్తానని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి . పార్టీ శ్రేణులతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఒక్కో నియోజకవర్గం కార్యకర్తలతో ప్రతి వారం భేటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వానికి మిగిలింది కేవలం రెండు బడ్జెట్లే అని వ్యాఖ్యానించిన జగన్, ఈ కాలంలోనైనా ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో రాష్ట్రంలో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల సామాన్యుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, విద్యా–వైద్య రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించే పరిస్థితి నెలకొందని జగన్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సహజమని, కానీ దానిని అణిచివేసేలా పాలన సాగుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి కీలక సంక్షేమ పథకాలను ప్రభుత్వం పూర్తిగా పడకేసిందని ఆరోపించారు.
ఇక పాలనంతా “రెడ్ బుక్ రాజ్యాంగం”తో, కండకావరంతో సాగుతోందని జగన్ విమర్శించారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ అబద్ధాలు, మోసాలతో నిండిపోయాయని, మోసం చేశారని నిలదీస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేశారని, ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ కూడా పోయిందని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని ఎద్దేవా చేశారు. ప్రజలే త్వరలో తగిన గుణపాఠం చెబుతారని జగన్ ధీమా వ్యక్తం చేశారు.
