చిత్తూరు జిల్లా పిళ్లారికుప్పం గ్రామంలో మానవ సంబంధాల్ని కలచివేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమకు ఇష్టంలేని ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో కన్న కూతురినే బతికుండగానే మృతిగా ప్రకటిస్తూ ఆమెకు కర్మక్రియలు నిర్వహించారు తల్లిదండ్రులు.
అదే గ్రామానికి చెందిన కిశోర్ను హేమప్రియ అనే యువతి ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దల మాట వినకుండా పెళ్లి చేసుకుందని భావించిన వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ మనస్తాపం చివరకు అమానుష నిర్ణయానికి దారి తీసింది.
తమ కుమార్తె ఇక తమకు లేనట్టేనంటూ ఆమె మృతి చెందినట్లు ప్రకటిస్తూ, హేమప్రియ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంతేకాదు, సంప్రదాయ కర్మక్రియలు కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటన గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
కన్నబిడ్డ సుఖసంతోషాలకన్నా సామాజిక ప్రతిష్ఠ, పరువు ముఖ్యమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
