బాలీవుడ్ నటి కాజోల్ దేవగన్కు ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ దక్కింది. కాజోల్ వ్యక్తిత్వ (పర్సనాలిటీ) మరియు పబ్లిసిటీ హక్కులను రక్షిస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ జారీ చేసింది. ఆమె పేరు, ఫోటోలు, రూపం వంటి లక్షణాలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించకుండా వివిధ సంస్థలను కోర్టు ఆదేశించింది. అలాగే ఆమె పేరుతో ప్రచారం అవుతున్న అసభ్య, అశ్లీల కంటెంట్ను తక్షణమే తొలగించాలని సూచించింది.
జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ కేసులో నోటీసులు జారీ చేసి, కాజోల్ అనుమతి లేకుండా ఆమె ఫోటోలు లేదా వ్యక్తిత్వ లక్షణాలతో వాణిజ్య వస్తువులు విక్రయించరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారమ్లలో ఆమె పేరుతో ప్రచారం అవుతున్న అశ్లీల, మార్ఫింగ్ చేసిన కంటెంట్ను వెంటనే తొలగించాలని కూడా ఆదేశించింది.
కాజోల్ తరఫున దాఖలైన పిటిషన్లో ఆమె వ్యక్తిత్వ హక్కుల దుర్వినియోగం, అనధికారికంగా మర్చండైజ్ విక్రయం, AI లేదా డీప్ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపాంతరం చేసిన అసభ్య కంటెంట్ ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. కోర్టు ప్రాథమికంగా ఇది వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా భావించి రక్షణ అవసరమని తెలిపింది.
