రాష్ట్రంలో మహిళల భద్రత కరువైందన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. మహిళలపై దారుణాలు జరిగితే తాట తీస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ మాటలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మమ్మద్ నజీర్ అహ్మద్లపై మహిళలపై జరిగిన ఆరోపణల విషయంలో చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగన్ ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కాకుండా వారి పీఏలు తప్పులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
అలాగే టీటీడీ చైర్మన్పై వచ్చిన ఆరోపణల విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఒక మహిళను మోసం చేసి వీడియోలు, ఫోటోలతో బయటపడిన వ్యక్తిపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తనను మోసం చేసిన టీటీడీ చైర్మన్పై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ గతంలోనే చంద్రబాబుకు లేఖ రాసినప్పటికీ, కనీసం విచారణ కూడా చేయకుండా అతనికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపించారు.
దేవుడిపై భయం, భక్తి, నిష్ఠ ఉంటే ఇలాంటి పనులు చేయరని జగన్ అన్నారు. అలాంటి వ్యక్తులు దేవుడి పవిత్రత, మహిళల గౌరవం గురించి మాట్లాడటం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.
