భారత ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజ (SIR) ప్రక్రియకు పూర్తి చట్టబద్ధత ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది. దేశంలో ఉచిత, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడానికి ఈ చర్యలతో ప్రత్యక్ష సంబంధం ఉందని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఈ ప్రక్రియను చేపట్టే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని, దీనివల్ల ఎలాంటి చట్టబద్ధమైన లేదా రాజ్యాంగపరమైన నిబంధనల ఉల్లంఘన జరగలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ ప్రత్యేక తనిఖీల (SIR) సమయంలో పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ సవరణ ప్రక్రియ చట్టబద్ధమైన, రాజ్యాంగపరమైన ఉద్దేశంతోనే జరిగిందని, ఇందులో పారదర్శకమైన విధానాన్నే పాటించారని కోర్టు పేర్కొంది.
అయితే ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడానికి నిరాకరించినంత మాత్రాన… ఆయా వ్యక్తుల పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని నిరూపించుకోలేకపోయారనే కారణంతో ఓటర్ల జాబితా నుండి ఎవరి పేర్లయినా తొలగించబడితే వారు తదుపరి న్యాయ విచారణకు అర్హులవుతారని పేర్కొంది. అలాంటి వారిని తగిన న్యాయ విచారణ లేదా పరిష్కారం కొరకు సంబంధిత సమర్థవంతమైన అధికారి వద్దకు పంపాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
రాజ్యాంగ నిబంధనలు మరియు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఓటర్ల జాబితాను సవరించే పూర్తి అధికారం ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఓటర్ల జాబితాలో ఉన్న నకిలీ, డూప్లికేట్, అర్హత లేని ఓటర్లతో పాటు మరణించిన వారి పేర్లు మరియు అక్రమ వలసదారుల పేర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడానికి ఎన్నికల సంఘం SIRను చేపట్టిన సంగతి తెలిసిందే.
పరిష్కరించాల్సిన సమస్య యొక్క తీవ్రతను, ఈ ప్రక్రియ యొక్క పరిధిని మరియు అమలు సమయంలో తీసుకున్న భద్రతా జాగ్రత్తలను పరిశీలిస్తే… కమిషన్ తీసుకున్న చర్యలు వారి లక్ష్యానికి విరుద్ధంగా ఏమీ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో సుప్రీం తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
