ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ముగియగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్కు మాత్రం గట్టి షాక్ తగిలింది. ఐపీఎల్ నియమాలను ఉల్లంఘించినందుకు గాను వచ్చే ఏడాది (IPL 2027) జరిగే సీజన్ లోని మొదటి మ్యాచ్ నుండి అతను సస్పెండ్ అయ్యాడు.
గుజరాత్ టైటాన్స్తో ఆదివారం జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో టిమ్ డేవిడ్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో డేవిడ్ తీవ్ర అసహనానికి గురై….మైదానంలోని అంపైర్ నితిన్ మీనన్ వైపు కోపంగా ఐస్ బ్యాగ్ను విసిరాడు. అంపైర్ పట్ల ఇలాంటి దూకుడు ప్రవర్తన ప్రదర్శించడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించబడింది.
ఈ ఘటనపై విచారణ జరిపిన మ్యాచ్ అధికారులు టిమ్ డేవిడ్ లెవెల్-1 తప్పు చేసినట్లు నిర్ధారించారు. ఐపీఎల్ నిబంధనలలోని ఆర్టికల్ 2.9 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతిని కానీ, మరేదైనా క్రికెట్ పరికరాన్ని (వాటర్ బాటిల్ లేదా ఇతర వస్తువులు) ఆటగాళ్లు, అంపైర్లు లేదా అధికారులపైకి ప్రమాదకర రీతిలో విసరడం నిషేధం. దీనికి గాను డేవిడ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు అతని ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లను చేర్చారు.
ఈ సీజన్లో టిమ్ డేవిడ్ ఇలా క్రమశిక్షణ తప్పడం ఇది మూడోసారి. గతంలో 20వ మ్యాచ్లో ఒక డీమెరిట్ పాయింట్…. 54వ మ్యాచ్లో రెండు డీమెరిట్ పాయింట్లు …ఫైనల్ మ్యాచ్తో కలిపి మొత్తం 5 డీమెరిట్ పాయింట్లను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒకే సీజన్ లో ఐదు డీమెరిట్ పాయింట్లు వస్తే ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు.
ఫలితంగా ఐపీఎల్ 2027 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడే మొదటి మ్యాచ్కు (లేదా వచ్చే సీజన్లో అతను ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడితే ఆ జట్టు ఆడే మొదటి మ్యాచ్కు) టిమ్ డేవిడ్ దూరం కానున్నాడు.
