ధర్మస్థల పుణ్యక్షేత్రంపై తాను కుట్ర చేస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ ఖండించారు. చిన్నయ్య అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ధర్మస్థల వెళ్లలేదని ఆయన స్పష్టం చేశారు.
ధర్మస్థలలో మృతదేహాలను ఖననం చేశానని చెప్పుకున్న చిన్నయ్య అనే వ్యక్తి, ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కేరళ నుంచి రూ.200 కోట్లు వచ్చాయని, ఈ విషయం ప్రకాశ్రాజ్కు తెలుసని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై బెంగళూరు ప్రెస్క్లబ్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రకాశ్రాజ్ వివరణ ఇచ్చారు.
చిన్నయ్య తనకు ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు, అతని తీరు అనుమానంగా ఉందని తాను అప్పట్లోనే సిట్ (SIT) చీఫ్ ప్రణబ్ మొహంతీకి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. తాను ఆ వ్యక్తిని ఎప్పుడూ కలవలేదని, కేవలం ఫోన్ సంభాషణ మాత్రమే జరిగిందని స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని, సౌజన్య హత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నానని తెలిపారు. అసలు ఈ కేసులో దర్యాప్తు జరపాలని మొదటగా మాజీ సీఎం సిద్ధరామయ్యను కోరిందే తానని ఆయన గుర్తు చేశారు.
ఈ సమావేశంలో ప్రకాశ్రాజ్ ‘అమ్ముడుపోయిన మీడియా’ అంటూ చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిని గమనించిన ఆయన, తాను అందరినీ ఉద్దేశించి ఆ మాట అనలేదని, కొందరు వ్యక్తులకు మాత్రమే ఆ వ్యాఖ్యలు వర్తిస్తాయని వివరణ ఇచ్చారు.
దేవాలయాలకు వెళ్లడంపై తన వైఖరిని స్పష్టం చేస్తూ, తాను నాస్తికుడినని, కానీ తన భార్య దైవభక్తి కలదని, ఆమె విశ్వాసాలను తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రశ్నించే హక్కు తనకు ఉందని, ఈ విషయంలో అనవసరమైన ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు.
