నీట్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ కలకలంరేపింది. రంగారెడ్డి జిల్లా దిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన నీట్ పరీక్షలో మాల్ప్రాక్టీస్ ఘటన వెలుగులోకి రావడంతో అంతా ఖంగుతిన్నారు. అచ్చంపేటకు చెందిన 18 ఏళ్ల విద్యార్థి నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ముందస్తు ప్రణాళికతో ఉదయం 7 గంటల ప్రాంతంలో పరీక్ష కేంద్రానికి వచ్చిన విద్యార్థి, పాఠశాల ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న బాత్రూం వెంటిలేటర్ ద్వారా ఓ సెల్ఫోన్ను లోపల దాచాడు. ఉదయం 11 గంటల సమయంలో బాత్రూంలోకి వెళ్లి సెల్ఫోన్ను జిప్లాక్ కవర్లో ఉంచి ఫ్లష్ ట్యాంక్లో దాచిపెట్టాడు.
పరీక్ష కేంద్రంలో ఉదయం 6 గంటలకు..11 గంటలకు పోలీసులు రెండుసార్లు తనిఖీలు నిర్వహించడంతో పాటు అభ్యర్థులందరికీ కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టినా, ఫ్లష్ ట్యాంక్లో దాచిన ఫోన్ గుర్తించలేకపోయారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కడుపు నొప్పిగా ఉందంటూ విద్యార్థి బాత్రూంకు వెళ్లేందుకు అనుమతి కోరాడు. అయితే ఎక్కువసేపు బయటకు రాకపోవడంతో అనుమానం చెందిన ఇన్విజిలేటర్ సిబ్బందిని పంపించారు.
దీంతో బాత్రూంలో సెల్ఫోన్ ద్వారా గూగుల్ క్రోమ్లో సమాధానాలు వెతుకుతున్న సమయంలో విద్యార్థిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా గూగుల్ క్రోమ్ ద్వారా సమాధానాల కోసం వెతికినట్లు గుర్తించారు. విచారణలో విద్యార్థి నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4)తో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) చట్టం-2024 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
