లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రముఖ యూట్యూబర్ రామ నందన (నందుస్ వరల్డ్)ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆర్జీఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్అవుట్ నోటీసులు జారీ కావడంతో ఈ చర్యలు చేపట్టారు. అనంతరం ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నందన, ఆమె భర్త జర్లమూడి మధుకర్, ఆయన తండ్రిపై చీటింగ్ కేసు నమోదైంది. యూకేలో నివసించే మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఈ ఫిర్యాదు చేశారు. యూకే వీసా పొడిగింపు, ఉద్యోగ సాయం, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (CoS) ఇప్పిస్తామని నమ్మించి.. మధుకర్, నందనకు చెందిన డెస్టినీ కన్సల్టెన్సీ ఖాతాలకు వివిధ విడతలుగా రూ. 15 లక్షలు బదిలీ చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే చెప్పినట్లుగా వీసా సేవలు అందకపోగా, ఇచ్చిన సీఓఎస్ పత్రం కూడా నకిలీదని తేలింది. బాధితుడు పదేపదే నిలదీయడంతో కేవలం రూ. 2 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి మిగతా డబ్బులు ఎత్తేశారు. దీంతో పోలీసులు మధుకర్ను A1గా, రామ నందనను A2గా, మోహన్రావును A3గా చేర్చి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
మరోవైపు ఈ ఆరోపణలన్నింటినీ నందన ఖండించారు. తమకు ఆ కన్సల్టెన్సీతో ఎలాంటి సంబంధం లేదని, కొందరు కావాలనే తమ పేర్లను అడ్డంపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. వ్యక్తిగత కక్షల వల్లే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఈ దంపతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ లుక్అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్పోర్టులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
