మూడో వన్డేకు టీమిండియా-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. అంతిమ పోరులో తేల్చుకోవడానికి రంగం సిద్ధమయ్యింది. ఇప్పటికె ఇరు జట్టు 1-1 తో సమయం చేయడంతో మూడో వన్డేకు ప్రాధాన్యత ఏర్పడింది. కాన్పూర్లో ని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగె సిరీస్ గెలుపు కోసం ఇరు జట్లు కసరత్తు చేస్తున్నాయి. ఒకవైపు కివీస్ రెక్కలు విరిచేసి సిరీస్ ను సాధించాలనే పట్టుదలతో విరాట్ సేన ఉండగా, తొలి వన్డేలో ఇచ్చిన ఝలక్ ను మరొకసారి భారత్ కు రుచిచూపించాలని కివీస్ యోచిస్తోంది.
పుణెలో జరిగిన చావో రేవో మ్యాచ్ లో ఒత్తిడిని జయించి పూర్తిస్థాయి ప్రదర్శనతో సత్తాచాటిన విరాట్ సేన.. మూడో వన్డేలో కూడా అదే స్థాయి ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది. ఫలితంగా చివరి వన్డేకు విరాట్ సేన ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగవచ్చు.
కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్ కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ ఇక్కడ భారత జట్టు 13 వన్డేలు ఆడితే తొమ్మిదింట విజయం సాధించింది. కాగా చివరిసారి 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో కివీస్ తో భారత్ కు ఇదే తొలి వన్డే కావడం విశేషం.
తొలి వన్డేలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొని.. రెండో వన్డేలో జూలు విదిలిచ్చిన విరాట్ సేన, సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డేలో కివీస్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనే యోచనలో ఉంది. ఇప్పటవరకూ ఆరు వరుస వన్డే సిరీస్ లు గెలిచిన టీమిండియాకు న్యూజిలాండ్ తో జరిగే చివరి వన్డే కచ్చితంగా అసలు సిసలైన పరీక్షే. స్వదేశంలో తిరుగులేని రికార్డు ఉన్న విరాట్ సేన దాన్ని కాపాడుకోవాలంటే రేపటి మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందె.
తొలి వన్డేలో సాధించిన అద్భుత విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి చెలరేగడానికి సమాయత్తమవుతోంది న్యూజిలాండ్. సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్న ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. విజేత ఎవరు అవుతారో చూడాలి.
