ఏదేశానికైనా రాజధాని ఉంటుంది. భారతదేశానికి రాజధాని అంటె న్యూఢిల్లీ…. యుఎస్ క్యాపిటల్ గురించి అడిగితె వాషింగ్టన్ డిసి అని టక్కు చెప్పేస్తాం. కాని రాజధానిలేని దేశం ఉందంటె నమ్ముతారా…? మీరు విన్నది నిజమే. రాజధానిలేని దేశం కూడా ఉంది. అది ఎక్కడో తెలుసుకుందాం.
ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం నౌరూ ఒక్కటే. 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, చిన్న బంగాళదుంప ఆకారంలో ఉండే ఈ దేశం మధ్య పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీప సముదాయాల్లో ఒకటి. తక్కువ జనాభాగత దేశాలలో వాటికన్సిటీ తర్వాత రెండోది నౌరూ. ఈ దేశానికి ప్రత్యేకంగా రక్షణ వ్యవస్థ అంటూ ఏమీ లేదు. దీని రక్షణ బాధ్యతలను ఆస్ట్రేలియా పర్యవేక్షిస్తుంది.
ఈ ప్రాంతంలో సముద్ర పక్షుల విసర్జితాలు గుట్టలుగా పేరుకుపోయి కాలక్రమంలో అవి పాస్ఫేట్ నిల్వలుగా రూపాంతరం చెందాయి. వీటి కారణంగా నౌరూ ఒకప్పుడు అత్యంత ధనిక దేశంగా పేరొందింది. అయితే రానురాను వాటి నిల్వలు క్షీణించడంతో ఈ దేశ ఆర్థిక పరిస్థితి కూడా చతికిలబడింది. ఈ దేశ జనాభా సుమారు 10 వేలు.
బ్రిటన్ నావికుడు జాన్ ఫియర్న్ 1798లో ఈ ద్వీపంపై కాలుమోపాడు. అయనే దీనికి ప్లజెంట్ ఐలాండ్గా నామకరణం చేశాడు. పాస్ఫేట్ మైనింగ్, ఆఫ్షోర్ బ్యాంకింగ్, కొబ్బరి ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు ఇక్కడి ప్రజలకు ప్రధాన జీవనాధారం. ఇక్కడి ప్రజలు ఊబకాయులు. ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు ఒబెసిటితో ఉన్న దేశం ఇది.
ఈబుల్లి దేశంలో పర్యాటకులు విడిది చేయడానికి ఉన్న హోటళ్లు రెండు మాత్రమే. దేశం మొత్తంమీద ఒక ఏయిర్పోర్ట్ ఉంది. రోడ్డు మార్గం ద్వారా దేశాన్ని చుట్టిరావడానికి 30 కి.మీ. ప్రయానిస్తె సరిపోతుంది. ఇక్కడి రైల్వే లైన్ పొడవు 5 కిలోమీటర్లు మాత్రమే. మైనింగ్ ద్వారా లభించిన పాస్ఫేట్ను ప్లాంట్లకు తరలించడానికి ఈ మార్గంలో రైళ్లను నడుపుతారు. ఇక్కడి ప్రజల్లో 93 శాతం మంది నౌరుయన్ భాష మాట్లాడతారు.
ఇక్కడ ఎటువంటి పన్నుల బెడద ఉండదు. 5-16 సంవత్సరాల పిలలు పాఠశాలకు వెళ్లడం తప్పనిసరి. ఇక్కడ చదువుకోవడానికి ఎవరూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా అన్ని సౌకర్యాలు ఉచితం. ఇక్కడ మొత్తం 12 తెగలవారు నివసిస్తున్నారు. ప్రతి తెగకూ ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంటుంది. ఒకే తెగకు చెందిన స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవడం నిషిద్ధం.
