తెలుగుదేశంపార్టీకి పెద్ద షాక్ తగిలింది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఒకరు వైసిపిలో చేరారు. తూర్పు నియోజకవర్గంలో బాగా పట్టున్న మండవ వెంకటాద్రి చౌదరి (ఎంవిఆర్) ఈరోజు ఉదయం జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. చౌదరి ప్రస్తుతం తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.ఆయన చేరకతో టీడీపీకి నష్టం తప్పదు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గంజిహల్లిలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం ఎంవీఆర్ చౌదరి వందలాది మంది కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. చౌదరికి పార్టీ కండువా కప్పి వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు
వైసీపీలో చేరే ముందు తన పదవితో పాటు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అరాచకాలు, అన్యాయలను చూసి సహించలేకే తాను పార్టీ మారినట్లు చౌదరి మీడియాతో చెప్పారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసిపి అభ్యర్ధి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. మాజీ ఎంఎల్ఏ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంఎల్ఏ మల్లాది విష్ణు చొరవతో చౌదరి వైసిపిలో చేరారు.
