దేశంలో బ్యాంకుల్లో రోజుకొక భారీకుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రముఖ నగల వ్యాపారీ నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యంకును రూ. 13 వేల కోట్ల మేర ముంచేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీని తర్వాత వివిధ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. రూ. 1000 కోట్ల మేర మోసం జరిగినట్టు సీబీఐకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది.
అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ లో భారీ కుంభకోనం వెలుగు చూసింది. రూ. 772 కోట్ల విలువైన మోసపూరిత రుణాలు జారీ అయిన విషయం వెలుగు చూసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐదు బ్రాంచుల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుందని వెల్లడైంది. 2009 నుంచి 2013 వరకు మోసపూరిత రుణాలు ఇచ్చినట్టు ఆడిట్ ద్వారా బయటపడింది.
చేపల పెంపకం చేపట్టేందుకు కొందరు వ్యక్తులు తప్పుడు ధ్రువపత్రాలు చూపించి, రుణాలు పొందినట్టు అధికారులు గుర్తించారు. బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులు ఈ రుణాలు మంజూరు చేసినట్టు తేలింది. వీరిలో ఒకరు ఇప్పటికే పదవీ విరమణ చేయగా, మరొక అధికారిని గుర్తించారు. ఈ కుంభకోణం వివరాలు బయటకు రాగానే ఐడీబీఐ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకు షేర్లు 3.5 శాతం కిందకి పడిపోయి రూ.73.6గా నమోదవుతున్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు ఇండెక్స్ కూడా 1.8 శాతం క్షీణించింది.
