కోల్కతాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలీపోర్ ప్రాంతంలో ని నిత్యం జనసమ్మర్ధంగా ఉండే మజెర్హట్ బ్రిడ్జి మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. పలువురు శిథిలాల చిక్కుకుపోయి ఉంటారని అనుమానిస్తున్నారు .
డైమండ్ హార్బర్ రోడ్లోని ఈ వంతెన సాయంత్రం 4.45 నిమిషాలకు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఐదు గంటలకు సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పలువురిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తే.. ఎక్కువ మంది బాధితులు వంతెన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
పలు కార్లు కూడా బ్రిడ్జి కింద చిక్కుకున్నాయి. ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. బ్రిడ్జి శకలాలు కింద పడటంతో శిథిలాల కింద కార్లు చిక్కుకుపోయాయి. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. అంబులెన్స్లు సైతం సంఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. బస్సు సర్వీసులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదానికి కారణాలు, మృతులు లేదా క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
