పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన ఓ వంతెన కుప్పకూలింది. వంతెన కింద బస్సులు, కార్లు ఉన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. అనేక మంది గాయడ్డారు. వారిని ఆసుపత్రిక తరలించి చికిత్స అందింస్తున్నారు.
వంతెన పై నుంచి చాలా వాహనాలు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కింద ఉన్న రైల్వే పట్టాలపై కూలింది. దీంతో వాహనాలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి. కూలిన బ్రిడ్జి.. దక్షిణ కోల్కతాలోని మజెర్హట్ బ్రిడ్జి. మంగళవారం (సెప్టెంబర్ 4) సాయంత్రం 4.45 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలు కార్లు, బైక్లు తుక్కుతుక్కయ్యాయి. అయిదు గంటలకు సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పలువురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
వంతెనపై ప్రయాణిస్తున్న వాహనదారులు గాయాలతో బయటపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల ఆర్తనాదాలు, మృతదేహాలతో ప్రమాదం జరిగిన స్థలం భయానకంగా ఉంది.కోల్కతాలోని అతి పురాతన బ్రిడ్జిల్లో ఇది ఒకటి. ఇటీవల ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగానే బ్రిడ్జి కూలిపోయిందని పోలీసులు భావిస్తున్నారు
ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆందోళన చెందుతున్నామని చెప్పారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టామన్నారు. తమ తొలి ప్రాధాన్యత బ్రిడ్జి కింద చిక్కుకుపోయిన వారిని కాపాడటం అన్నారు.
