జగన్పై దాడి ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడిపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్లో చికిత్సపొందుతున్న జగన్ను మంత్రి పరామర్శించారు.
బాధ్యత గల ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే.. చంద్రబాబు దానిని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు తలసాని. మనిషి ప్రాణాలు పోతుంటే.. డ్రామాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ పెద్ద డ్రామా కంపెనీ అని.. 30 ఏళ్లు పార్టీలో ఉన్న తనకు ఆ డ్రామాలన్నీ తెలుసన్నారు
ప్రతిపక్షనేతపై దాడి జరిగితే గవర్నర్.. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగితే తప్పా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు వేరైనా తామంతా ప్రజాస్వామ్యంలో కలిసే పనిచేస్తున్నామన్నారు. మానవతా దృక్పథంతోనే కేసీఆర్, కేటీఆర్, కవిత .. జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని తలసాని అన్నారు.
స్పెషల్ స్టేటస్ అడిగితే మాపై దాడు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించడం దారుణమన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగింది ఎవరని ప్రశ్నించారు. హోదా ఏమన్నా సంజీవనా అంటూ బాబు గతంలో వ్యాఖ్యానించింది నిజం కాదా అన్నారు. చంద్రబాబుపై గతంలో అలిపిరిలో దాడి జరిగినప్పుడు.. ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించ లేదా అని ప్రశ్నించారు. విపక్షాల నేతలు కూడా వచ్చి పరామర్శించిన సంగతి మర్చిపోకూడదని బాబుకు హితవు పలికారు.