ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ దూసుకుపోతున్నారు. రోజు మూడు నాలుగు బహిరంగసభలు నిర్వహిస్తూ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. తాజాగా పలమనేరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబుపై జగన్ నిప్పులు చెరిగారు. ఎలాంటి తప్పు చేయకపోతె సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నేరగాడు కాకపోతే హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోబెల్స్ వారసుడు చంద్రబాబేనని చెప్పుకొచ్చారు. తన బాబాయ్ మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని సీఎం చంద్రబాబే చంపించారని ఆరోపించారు. వారే చంపి వారి పోలీసులతోనే విచారణ చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. తన బాబాయ్ హత్య కేసులో చంద్రబాబుకు సంబంధం లేకపోతె సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.చంద్రబాబు నేరగాడు కాకపోతే సీబీఐకి, ఈడీకి, ఐటీకి, చివరకు తెలంగాణ కానిస్టేబుల్కు కూడా ఎందుకు భయపడుతున్నారు? చంద్రబాబు నేరగాడు కాకపోతే.. తనపై ఉన్న అన్ని కేసులో టెక్నికల్ కారణాలు చూపుతూ స్టేలు ఎందుకు తెచ్చుకున్నారంటూ ధ్వజమెత్తారు.
బాబు హయాంలో నేరాలు పెరిగిపోయానన్నారు. చదువుకోవడానికి వచ్చిన రిషితేశ్వరి అనే విద్యార్థిని దారుణంగా చనిపోయిన కేసులో బాబురావును ఎందుకు అరెస్ట్ చేయలేదు?. ఆ వ్యక్తి చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టే అతని జోలికి ఎవరూ వెళ్లలేదు. ఇసుక అక్రమ రవాణాను ఎమ్మార్వో వణజాక్షిని అక్కడి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని ఇడ్చుకుంటూ పోతే ఎలాంటి కేసు లేదని ధ్వజమెత్తారు.
విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ నడిపిన మృగాలను చంద్రబాబు కాపాడారు. కాల్మనీ బాధితులకు జరిగిన అన్యాయంపై మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో తోటలను తగులబెట్టించారు.పత్తికొండలో నారాయణరెడ్డిని అతి కిరాతకంగా నరికించింది చంద్రబాబు కాదా?. తాడిపత్రి ప్రభుత్వ కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ను విజయ భాస్కర్రెడ్డిని నరికి చంపిన ఘటన నిజం కాదా?. చంద్రబాబు పాలన కాలంలో వైఎస్సార్సీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డగోలుగా చంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదాని ప్రశ్నించారు.
బాబు ఇచ్చే రూ.3000 లకు మోస పోవద్దని సూచించారు. ఎన్నికల వచ్చేసరికి రోజుకో డ్రామా, రోజుకో పిట్ట కథలు అల్లుతారన్నారు. చంద్రబాబు ఒక్కరితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేస్తున్నామన్నారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి ఎప్పండని ప్రజలకు సూచించారు.