కామెంట్లపై యాంకర్ అనసూయ ఆగ్రహం
బుల్లితెర నుంచి సినిమా రంగానికి వచ్చిన నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈమె టీవీ ప్రోగ్రామ్స్లలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తోంది. అయితే అనసూయకు కోపమొచ్చేసింది. ఒక్కసారిగా తన ఆవేదనను అంతా ట్విట్టర్లో పోస్టు చేసింది. తన వస్త్రధారణ, తనపై వస్తున్న కామెంట్లు తదితర వాటిపై స్పందిస్తూ ట్విట్టర్లో ఓ ఫొటో పెట్టింది.
‘డియర్ ఇండియా..ఓ కూతురిగా, సోదరిగా, మహిళగా, భార్యగా, కోడలిగా, తల్లిగా నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా. నేను చేసే పని, వేసుకునే దుస్తులు నా కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కానీ ఇతరులు వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని అగౌరవపరిచే హక్కు వారికెక్కడిది? రోజూ అసభ్యకర ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కామెంట్లు వస్తుయి. ఓ బాధ్యత గల మహిళగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నాకు నచ్చిన పనిని స్వేచ్ఛగా చేయలేకపోతున్నాను. కొందరు ఆకతాయిలు సంప్రదాయం, సంస్కృతి పేరిట నా ఆశల్ని అణచి వేయాలనుకుంటున్నారు. ఇవన్నీ అనుభవిస్తూ బతకాల్సిందేనా? ఈ విషయంలో ఏమీ చేయలేమా? స్వేచ్ఛ అంటే ఇదేనా?’ అని అనసూయ ఆ ఫొటోలో ప్రశ్నించింది.
ఈ విధంగా తనపై వస్తున్న పుకార్లు, కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనూ ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రజా జీవితంలో ఉన్నవారి గురించి ఇలా మాట్లాడడం భావ్యం కాదని కొందరు పేర్కొంటున్నారు. ఈమెకు మద్దతుగా బుల్లితెరకు చెందిన వారు నిలబడుతున్నారు.
#HappyRepublicDay 🙏🏻🙏🏻🤷🏻♀️ pic.twitter.com/cMQm4PTzHX
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 26, 2018