సినీ పరిశ్రమ తలరింపుపై బాలకృష్ణ
మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. ఎంతో కష్టనష్టాలతో ఆ సినిమా పరిశ్రమ భాగ్యనగరానికి వచ్చి కొలువైంది. ఇక్కడ నిలదొక్కుకోవడానికి కూడా చాన్నాళ్లే పట్టింది. అయితే ఇప్పుడు వస్తున్న ముచ్చటేమంటే తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తారనే ప్రచారం కొనసాగుతోంది. ఆ విధంగా అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఏపీ సీఎం బామ్మర్ది, ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా కావడంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ విభజన జరగాలని కొందరు వ్యక్తిగత కారణాలతో కోరుతున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఉన్న పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోగానీ, విశాఖపట్టణంలోకి తరలించాలని కొందరు పన్నాగం పన్నుతున్నారు. దీనిపై బాలకృష్ణ స్పందించి వారికి చురకలు అంటించారు.
సినీ పరిశ్రమ పూర్తిగా అక్కడికి తరలిపోవాల్సిన అవసరం లేదని బాలయ్య స్పష్టం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో అందమైన లొకేషన్లు ఉన్న మాట వాస్తవం. అక్కడ షూటింగులు జరగాలి. కానీ మొత్తంగా పరిశ్రమ అంతా హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. అలా ఎవరూ కోరుకోకూడదు. మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి బలమైన కారణం ఉంది. ప్రాంతీయత, భాష ప్రభావం చూపించాయి. కానీ ఇప్పుడు ఇక్కడున్నవి రెండూ తెలుగు రాష్ట్రాలే. తెలంగాణ అన్నామన తెలుగువాళ్లే కదా. రెండు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లు. కాబట్టి పరిశ్రమ తరలివెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరిష్టం వాళ్లది. ఐతే నేను మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక స్టూడియో నిర్మిస్తాను’’ అని బాలయ్య చెప్పాడు.