లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వెన్నుపోటు పాటను వర్మ యూట్యూబ్లో ఇటీవల విడుదల చేశారు. ఈ పాట ఏపీ సీఎం చంద్రబాబునాయుడును కించపర్చే విధంగా ఉందని టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తం వర్మకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మను కూడా తగల బెట్టారు తెలుగు తమ్ముళ్లు.
ఈ పాటపై కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో రామ్గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశారు. ఆయనపై పరువునష్టంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై వర్మ గతంలోనే స్పందించారు. అయితే తాజాగా మరో సారి రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి రామ్ గోపాల్ వర్మ బుధవారం నాడు లీగల్ నోటీసు పంపారు. 48 గంటల్లోపుగా తనకు క్షమాపణ చెప్పి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఆ నోటీసులో వర్మ కోరారు.పరువునష్టం కేసును కేవలం సంబంధిత వ్యక్తి మాత్రమే దాఖలు చేయగలరనీ, పక్కనవాళ్లు చేయలేరని వర్మ లాయర్ నోటీసులో తెలిపారు. లేదంటే ఆ తర్వాత తీసుకోబోయే సివిల్, క్రిమినల్ చర్యలకు ఆయనే స్వయంగా బాధ్యులు అవుతారని హెచ్చరించారు. అంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే తన క్లయింట్ పై పరువునష్టం కేసు పెట్టగలరని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని వర్మ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.